గాసిప్స్కు బ్రేకేసిన ‘శ్యామ్ సింగ రాయ్’
నేచురల్ స్టార్ నాని తన చిత్రంపై వస్తున్న గాసిప్స్కి ఫుల్స్టాప్ పెట్టేశాడు. నాని, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం ఆగిపోయిందని, ఈ ప్రాజెక్ట్ పక్కనెట్టి నాని మరో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో.. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని ప్రారంభించి ఆ వార్తలకు నేచురల్ స్టార్ ఫుల్స్టాప్ పెట్టేశాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.
- Advertisement -
నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి (‘ఉప్పెన’ ఫేమ్) నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ (‘ప్రేమమ్’ ఫేమ్), రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గురువారం నాని, సాయిపల్లవి, కృతి శెట్టిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ నివ్వగా, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్చాన్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్లు శివ నిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్టును దర్శక నిర్మాతలకు అందజేశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి సత్యదేవ్ జంగా కథను సమకూర్చగా, మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్గా, నవీన్ నూలి ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈ నెలలోనే ‘శ్యామ్ సింగ రాయ్’ రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనున్నారు.