పంచాయతీ ఎన్నికలలో జనసేన వైపు మొగ్గిన కాపులు..!
రాజకీయాలు కులం, మతం మీద ఆధారపడి ఉన్నాయని అందరికీ తెలుసు. రాజకీయాలు కులం, మతంతొ ముడిపడి ఉన్నాయి. కులాల బలం ఎక్కువ ఎవరికి ఉంటే వారు గెలిచే పరిస్థితి ఉంది. ఇది కేవలం ఒక ఆంధ్రరాష్ట్రంలోనే కాదు, మొత్తం భారతదేశంలోనే ఉంది.ప్రస్తుత పరిస్థితులలో కులాలకు, మతాలకు అతీతంగా రాజకీయాలు చేయడం సాధ్యం కాదని చెప్పాలి. ప్రస్తుతం ఎపి అధికార పార్టీ వైసిపి విషయానికి వస్తే అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది.
అన్ని సామాజికవర్గాల్లో పట్టు సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తూ, కులాల ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, కులానికో కార్పొరేషన్ ప్రకటించి, వాటికి పదవులు, నిధులు కేటాయించి జగన్ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు.కాపులకూ అంతే స్థాయిలో ప్రాధాన్యం కల్పించారు.అయినా ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికలలో టిడిపి, అధికార పార్టీ వైసీపీ కంటే జనసేన వైపు కాపులు మొగ్గు చూపారనే విషయం స్పష్టంగా అర్థమైంది.
2019 ఎన్నికలలో కాపులు జనసేన కంటే ఎక్కువగా జగన్ ను నమ్మారు.కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేమని జగన్ ప్రకటించినా, ఆయన వైపు నిలబడ్డారు.అయితే క్రమక్రమంగా కాపుల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు ఈ పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి.ఒకవైపు జనసేన, మరోవైపు బిజెపి కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా వ్యవహరించడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సామాజిక వర్గంను మరింత దగ్గర చేసుకునే విధంగా ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్న తీరు , యువత, సినీ అభిమానులు ఎక్కువగా జనసేన వైపు నిలబడడం వంటి కారణాలతో అనూహ్యంగా కాపు ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో జనసేనకి అనుకూలంగా పంచాయతీ ఫలితాలు వచ్చాయి.
- Advertisement -
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఇక తాము కాపుల కోసం ఎంతగా ప్రయాసపడినా, ఆ సామాజిక వర్గంకు చెందిన మెజారిటీ ఓటర్లు జనసేన వైపే నిలబడతారని, కాపులను ఎక్కువగా నమ్ముకునే కంటే, బీసీ సామాజిక వర్గాలను మరింత దగ్గర చేసుకుని పూర్తిగా వారిని దగ్గర చేసుకోవాలనే ఆలోచనతో జగన్ ఉన్నారట.అసలు మొదటి నుంచి బీసీ సామాజికవర్గం పేరు చెబితే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడేవారు.బీసీల పార్టీగా తెలుగుదేశం ముద్ర వేయించుకుంది.
కానీ 2019 ఎన్నికల్లో బిసిలు జగన్తో కలిసి ఉండటంతో తెలుగు దేశం పార్టీ పరాజయం పాలైంది. టిడిపి ప్రతిపక్షంలోకి వచ్చి నప్పటి నుండి, బీసీల పార్టీగా తనను తాను పూర్వ వైభవం తెచ్చు కోవాలని తెలుగు దేశం పార్టీ పోస్టులలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
అయితే, టిడిపికి అవకాశం ఇవ్వకుండా, బీసీలకు టిడిపిని మరింత దూరం చేసేలా బిసిలను ఎక్కువ మరిన్ని వరాలు ప్రకటించి టిడిపికి దూరం చేయాలనే ఆలోచనతో జగన్ ఉన్నారు. కాపులు జనసేన వైపు వెళ్ళినా, బీసీల పూర్తి మద్దతు ఉంటే, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సహకారంతో వైసీపీ సులభంగా బయటపడవచ్చని జగన్ అభిప్రాయ పడుతున్నారు. అదే జరిగితే టిడిపి రాజకీయంగా పెద్ద ఇబ్బందుల్లో పడుతుంది.