భారత భూభాగాన్ని కేంద్రం చైనాకు ఇచ్చేసిందంటూ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో రాహుల్ కాస్త ఉన్నతంగా ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు. గాల్వాన్ లోయలో గాయపడ్డ ఓ జవాను తండ్రి మాట్లాడిన వీడయోను షా ట్వీట్ చేశారు.
‘‘భారత ఆర్మీ అత్యంత ధైర్య సాహసాలు కలది. చైనాను ఓడించే సత్తా ఉన్న ఆర్మీ. రాహుల్ గాంధీ….. రాజకీయాల్లో మునిగిపోకండి. నా కొడుకు సైన్యంలో పోరాడారు. పోరాటం కొనసాగిస్తూనే ఉంటాడు.’’ అని ఓ జవాన్ తండ్రి ఆ వీడియోలో పేర్కొన్నారు.
దీనిపై అమిత్షా ట్వీట్ చేస్తూ… ‘‘అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఓ జవాను తండ్రి మాట్లాడారు. రాహుల్ గాంధీకి ఆయన స్పష్టమైన జవాబిచ్చారు. దేశం మొత్తం ఒకే తాటిపై ఉన్న సమయంలో దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ కూడా కాస్త ఉన్నతంగా ఆలోచించాలి. రాజకీయాలు చేయకూడదు.’’ అంటూ షా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.